ఇంఫాల్: మణిపూర్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దుండగులు పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకోగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక జవాన్ కాలుకు గాయమైంది. (Manipur Firing) కాంగ్పోక్పి జిల్లాలోని సేనాపతి, పరిసర ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగాయి. సోమవారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో నాగా తెగలకు చెందినవారి ఇళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. తఫౌ కుకి, ఫూబా గ్రామాల్లో నాగా నివాసితుల ఇళ్లకు నిప్పుపెట్టారు. లై గ్రామానికి చెందిన నాగా నివాసి ఇంటిని కూల్చివేశారు. 9ఎంఆర్, మారెయిమెయి పరిసరాల్లో కూడా నాగా తెగలకు చెందిన ఇళ్లపై దాడులు జరిగాయి.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బందితో పాటు పారామిలిటరీ దళాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. అయితే లియాంగ్మై తఫౌ వద్ద ఊహించని విధంగా కాల్పులు జరిగాయి. 36 సీఆర్పీఎఫ్కు చెందిన జవాన్ కాలికి బుల్లెట్ గాయమైంది. సేనాపతిలోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరువైపుల నుంచి కాల్పులు జరిగినట్లు కనిపించిందని, అయితే బుల్లెట్ ఏ దిశ నుంచి వచ్చిందో తాను గుర్తించలేకపోయానని గాయపడిన ఆ జవాన్ తెలిపారు.
మరోవైపు తమ ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడంపై నాగా తెగల ప్రజలు ఆగ్రహం చెందారు. ఇంఫాల్ – దిమాపూర్ హైవేను దిగ్బంధించారు. దీంతో మణిపూర్, నాగాలాండ్ మధ్య ఉన్న నేషనల్ హైవే 2 మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. తమ ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని నాగా తెగల సంస్థ డిమాండ్ చేసింది. లేనిపక్షంతో తాము ప్రతీకార దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. సేనాపతి, తఫౌ, పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో భద్రతా బలగాలను మోహరించారు.