అహ్మదాబాద్: గుజరాత్లోని పోర్బందర్లో అనుకోని ఘటన చోటుచేసుకున్నది. డిసెంబర్లో జరుగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్కు చెందిన సీఆర్పీఎఫ్ బెటాలియన్కు చెందిన జవాన్లు ఎన్నికల విధుల్లో భాగంగా పోర్బంర్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాను పునరావాస కేంద్రంలో ఉన్నారు.
కాగా, శనివారం సాయంత్రం బస్సులో ప్రయాణిస్తుండగా వారిమధ్య గొడవ తలెత్తింది. దీంతో ఎస్.ఇనౌచాసింగ్ అనే జవాన్.. తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని జామ్నగర్లోని భావ్సింగ్జీ దవాఖానకు తరలించారు.
మరణించినవారిని తోయిబా సింగ్, జితేందర్ సింగ్గా, గాయపడినవారిని చోరజిత్ సింగ్, రోహికానగా గుర్తించామన్నారు. వారిలో ఒకరికి పొత్తికడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లగా, మరొకరి కాలుకు గాయమైందని పోలీసులు తెలిపారు. మొదటి దశలో భాగంగా పోర్బందర్లో డిసెంబర్ 1న ఎన్నికలు జరుగనున్నాయి.