న్యూఢిల్లీ, జనవరి 5: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రొసీజర్ ఆఫ్ మెమొరాండం(ఎమ్ఓపీ) అమలుపై కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం ఏడేండ్లుగా ఏకాభిప్రాయానికి రాకపోవడంపై పార్లమెంటరీ ప్యానెల్ ఆశ్చ ర్యం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు పరిశీలన ప్రకారం సవరించిన ఎంఓపీ మరింత సమర్థవంతమైనది, పారదర్శకమైనదని న్యాయశాఖ స్థాయి సంఘం తన తాజా నివేదికలో పేర్కొంది. దీన్ని కేంద్రం, సుప్రీంకోర్టు త్వరలోనే ఖరారు చేస్తాయని సంఘం భావిస్తున్నది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలను నియమించే కొలీజియం వ్యవస్థ స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం, రాజ్యాంగ సవరణ చట్టం ఏప్రిల్ 13, 2015న అమల్లోకి వచ్చాయి. అయితే వీటిని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అప్పటికే అమల్లో ఉన్న ఎంఓపీలో సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదింపులు జరపడం, అర్హత ప్రమాణాలను పరిగణనలోనికి తీసుకోవడం, పారదర్శకత పాటించడం, ఫిర్యాదుల పరిష్కారం కోసం సెక్రటేరియట్ ఏర్పాటు లాంటి అంశాలను జత చేసి ఎంఓపీని ఖరారు చేయాలని 2015 డిసెంబర్లో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.