లక్నో: ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఆదివారం జరుగాల్సిన ఉత్తర ప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (యూపీ టెట్) రద్దైంది. వాట్సాప్ గ్రూప్లో పేపర్ సర్క్యులేట్ కావడంతో పరీక్షను నిలిపివేశారు. దీంతో పరీక్షా కేంద్రాలకు హాజరైన అభ్యర్థులు నిరాశతో వెనుతిరిగారు. పరీక్ష రద్దు కావడంతో కొందరు ఏడ్చారు. ‘యుపీ టెట్ పరీక్షా పత్రం లీక్ అయినట్లు సమాచారం అందింది. అందువల్ల పరీక్షను రద్దు చేశాం. ఒక నెల వ్యవధిలో నిర్వహిస్తాం. అభ్యర్థులపై భారం పడకుండా చేస్తాం. పేపర్ లీకేజీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆర్డర్ జారీ చేశాం. దర్యాప్తును ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగానికి అప్పగించాం. నిందితులను త్వరగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని యూపీ విద్యాశాఖ మంత్రి సతీష్ ద్వివేది తెలిపారు.
కాగా, పేపర్ లీక్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యూపీ టెట్ ప్రశ్నా పత్రం లీకేజ్కు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు. యూపీ టెట్ పరీక్ష రద్దు నేపథ్యంలో అభ్యర్థులు నిరాశకు లోనయ్యారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో అని సందేహం వ్యక్తం చేశారు. ఖాళీల సంఖ్య తగ్గవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రిపరేషన్కు మరి కొంత సమయం లభించడంతో టెస్ట్ రద్దు నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు, పేపర్ లీక్ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. యూపీ టెట్ పరీక్షలో అవినీతి జరిగిందని ఆరోపించారు.