దర్యాప్తు బాధ్యత సీబీఐదే
నంబి నారాయణన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 26: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త నంబి నారాయణన్ (79)కు సంబంధించిన గూఢచర్య కేసులో అక్రమంగా వ్యవహరించిన పోలీసుల పాత్రపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలోని కమిటీ దాఖలు చేసిన నివేదిక ప్రాసిక్యూషన్కు ప్రామాణికం కాబోదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై దర్యాప్తు జరిపి ఆధారాలను సేకరించాల్సిన బాధ్యత కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)దేనని సోమవారం తేల్చిచెప్పింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గతంలోనే నంబి నారాయణన్ను నిర్దోషిగా తేల్చి ఆయనకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి చట్టపరంగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐపై ఉన్నదని సుప్రీం కోర్టు పేర్కొన్నది. సీబీఐ కేవలం ఓ నివేదికను ఆధారంగా చేసుకొని నిందితులకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఈ కేసుపై దర్యాప్తు జరిపి ఆధారాలను సేకరించడంతోపాటు ఆ తర్వాత చట్టపరంగా ముందుకు సాగాల్సిన బాధ్యత సీబీఐదేని జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ సంజీవ్ఖన్నాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.