జమ్ము, అక్టోబర్ 28: జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామానికి చెందిన చివరి కశ్మీరీ పండిట్ డాలీ కుమారి కూడా శుక్రవారం ఆ గ్రామాన్ని వీడి జమ్ముకు తరలిపోయారు. ‘భయంతో బతకలేం.. ఇంతకుమించి ఏం చేయగలం’ అని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు.సొంత ఇంటిని వదలివెళ్లడం బాధగా ఉందన్నారు. గ్రామానికి చెందిన మిగిలిన పండిట్ కుటుంబాలు ఇప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దాదాపు 35నుంచి 40 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జమ్ముకు చేరుకున్నారు.
కశ్మీర్ లోయలో నివసించే పరిస్థితి లేదని, భయం గుప్పిట బతుకుతున్నామని పేర్కొన్నారు. తమ ప్రాణాలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తంచేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా.. ఊరికి దూరంగా పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అక్టోబర్ 15న కశ్మీరీ పండిట్ పురాణ్ క్రిషన్ భట్ను ఉగ్రవాదులు అతడి ఇంటి బయట కాల్చి చంపారు. అక్టోబర్ 18న ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో మోనిశ్కుమార్, రాంసాగర్ అనే కశ్మీరీ పండిట్లు మృతిచెందారు. తమ భద్రతను మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని పండిట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమను లోయ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గత కొన్ని నెలలుగా నిరసనలు చేపడుతున్నారు. అయినా వీరి మొరను కేంద్రం పట్టించుకోవడం లేదు.
జమ్ముకశ్మీర్ యంత్రాంగంపై విమర్శలు
పండిట్లు గ్రామాలను వీడుతున్నా జమ్ముకశ్మీర్ యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. వార్తలు నిరాధారమని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ప్రయత్నాలని చెప్పుకొచ్చింది. అధికారుల స్పందనపై కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి(కేపీఎస్ఎస్) తీవ్రంగా స్పందించింది. కశ్మీర్లో అహంకారపూరిత, వారి గురించి మాత్రమే ఆలోచించుకొనే అధికారులు ఇలా నిరంతరంగా తిరస్కరణ మోడ్లోనే ఉన్నారని మండిపడింది. ‘కశ్మీర్ లోయలో వారికి అయితే అంతా బాగుంది. అసమర్థత బీజేపీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం కశ్మీర్లో శాంతి భద్రతలను చీకట్లోకి నెట్టాయని ట్విట్టర్లో విమర్శించింది. మోదీ ప్రభుత్వం తన ఎనిమిదేండ్ల పాలనలో కశ్మీర్లో పండిట్ల్ల దుస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు.
ఏడాదిలో ఐదుగురు పండిట్ల హత్య
కశ్మీర్ లోయలో గత ఏడాది వ్యవధిలోనే ఐదుగురు పండిట్లను ఉగ్రవాదులు హత్యచేశారు. దీంతో పండిట్ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకుండా గత ఆరు నెలలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడే వరకూ తమను జమ్ముకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.