జమ్ము: ఉద్యోగానికి రాకపోతే జీతాలు కట్ చేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై కశ్మీరీ పండిట్లు మండిపడ్డారు. గురువారం జమ్ములోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడే రోడ్డుపై కూర్చొని ఆందోళన చేపట్టారు. బీజేపీకి, ఎల్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కశ్మీరీ పండిట్లు మాట్లాడుతూ ‘లోయ ప్రాంతంలో మాకు భద్రత లేదు. అక్కడి నుంచి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ మేము, డోగ్రా ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా జీతాలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మాకు జీతాలు ముఖ్యం కాదు. ప్రాణాలు ముఖ్యం. ఉద్యోగుల బదిలీకి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తామని బీజేపీ నాయకలు చాలా సార్లు చెప్పారు. తర్వాత గాలికొదిలేశారు’ అని మండిపడ్డారు. ‘ఒకవైపు ఉద్యోగానికి రావాలని మీరు అంటున్నారు. మరోవైపు చంపుతామని ఉగ్రవాదులు బెదిరిస్తున్నారు. మేము ఏం చెయ్యాలి?’ అని ప్రశ్నించారు.