న్యూఢిల్లీ: దేశంలో కరోనా (COVID-19) మహమ్మారి ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులపై 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై నిఘా పెట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. లేనిపక్షంలో కరోనా మహమ్మారి నియంత్రణకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేరకు ఎనిమిది రాష్ట్రాలకు లేఖలు రాశారు. కేరళలోని 14 జిల్లాలు, హర్యానాలో 12, ఢిల్లీలో 11, తమిళనాడులో 11, మహారాష్ట్రలో 8, రాజస్థాన్లో 6, ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లాలో పది శాతానికిపైగా కరోనా పాజిటివిటీ రేటు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే హాస్పిటల్స్లో చేరే రోగుల సంఖ్య, కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయన్నారు.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలు, ప్రాంతాలపై దృష్టిసారించాలని, మరింతగా వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆ ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా టెస్ట్లను పెంచడంతోపాటు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపే నమూనాల సంఖ్యను పెంచాలని పేర్కొంది. కాగా, దేశంలో శుక్రవారం కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి పెరిగింది.