న్యూఢిల్లీ, జూన్ 14: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు. దివంగత నేత రాంవిలాస్పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) సంక్షోభంలో చిక్కుకున్నది. చిరాగ్కు వ్యతిరేకంగా ఆయన బాబాయి, హాజీపూర్ ఎంపీ పశుపతి కుమార్ పరాస్ తిరుగుబావుటా ఎగురువేశారు. ఎల్జేపీకి లోక్సభలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉండగా, నలుగురు పశుపతికి మద్దతుగా నిలిచారు. చిరాగ్ స్థానంలో పశుపతిని పార్టీ లోక్సభ పక్షనేతగా వారు ఎన్నుకున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆయనను ఎల్జేపీ లోక్సభ పక్ష నేతగా స్పీకర్ కార్యాలయం గుర్తించింది. పశుపతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీని చీల్చలేదని, కాపాడానని తెలిపారు.ఈ సందర్భంగా జేడీయూ అధినేత నితీశ్కుమార్పై ఆయన ప్రశంసలు కురిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు వ్యతిరేకంగా వెళ్లి ఘోరమైన ఫలితాలు చవిచూడడంపై పార్టీలోని 99 శాతం మంది కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. తమ బృందం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతోనే కొనసాగుతుందని, చిరాగ్ పార్టీలోనే ఉంటారని పేర్కొన్నారు. అయితే పార్టీలో తిరుగుబాటుపై చిరాగ్ ఇంకా స్పందించలేదు.రామ్విలాస్పాశ్వాన్ మరణానంతరం చిరాగ్ పార్టీ పగ్గాలు చేపట్టగా.. ఆయన వ్యవహార శైలిపై రెబల్ నేతలు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. మొత్తంగా పార్టీలో ఇప్పుడు చిరాగ్ ఒంటరిగా మారారు. త్వరలోనే చిరాగ్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించనున్నట్టు తెలుస్తున్నది.
సీఎం నితీశ్ హస్తం !
ఎల్జేపీ చీలిక వెనుక నితీశ్ హస్తం ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఎన్డీఏను వీడి ఎల్జేపీ ఒంటరిగా బరిలోకి దిగడంతో జేడీయూ తీవ్రంగా నష్టపోయి 35 సీట్లకే పరిమితమైంది. ఎల్జేపీ అభ్యర్థులను నిలిపిన చోట జేడీయూ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలోనే చిరాగ్ను ఒంటరి చేయాలని నితీశ్ పావులు కదిపినట్టు సమాచారం.