న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఇండియాలో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబంధించి అలెర్ట్ జారీ చేసినట్లు కూడా తెలిసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఐఈడీని టిఫిన్ బాక్స్లో పెట్టి ఈ పేలుడు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. దేశంలో పండుగల సీజన్ కావడంతో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు జరపడానికి ఐఎస్ఐ ప్రణాళిక రచించిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులు కూడా దేశంలోకి చొరబడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించాయి.
ఈ ప్లాన్ అమలు చేయడానికి ఇప్పటికే మనుషులు, అవసరమైన ఆర్థిక వనరులు, వస్తువులను సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్ వెల్లడించింది. గత వారం పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నవరాత్రి, రామ్లీలా సందర్భంగా పేలుడు కోసం రచించిన ప్రణాళికను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం భగ్నం చేసింది. దీనికి సంబంధించి ఆరుగురిని అరెస్ట్ కూడా చేశారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఈ ఆపరేషన్ నుంచి ఆడీఎక్స్ ఉన్న ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు.