న్యూఢిల్లీ : ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సమయంలో పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16, జే-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు భారతీయ వైమానిక దళ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. అమెరికా తయారీకి చెందిన ఎఫ్-16, చైనా తయారీకి చెందిన జే-17 విమానాలను ధ్వంసం చేసినట్లు ఆయన వెల్లడించారు. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. భారతీయ యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తమ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాక్ ఆర్మీ ఆ ప్రచారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాల్పుల విరమణ పాటించాలని పాకిస్థాన్ కోరిందన్నారు. అమాయక ప్రజల్ని చంపిన ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారీ మూల్యం చెల్లించుకున్నట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెల్లడించారు. మనం మన లక్ష్యాన్ని సాధించిన అంశాన్ని ప్రపంచం ప్రత్యక్షంగా వీక్షించిందన్నారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను కూడా చేధించామన్నారు. ఆ తర్వాతే పాకిస్థాన్ కాల్పుల విమరణ ప్రతిపాదన చేసిందన్నారు. భారతీయ వైమానిక దళ రక్షణ వ్యవస్థలపై అమర్ ప్రీత్ సింగ్ ప్రశంసలు కురిపించారు. సుమారు 100 గంటల పాటు సాగిన సంక్షోభ సమయంలో పాకిస్థానీ మిస్సైళ్లు, డ్రోన్లను మన రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఢీకొట్టిందన్నారు.
ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఓ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే తరాల్లో సైనిక యుద్ధ నీతి మారబోతోందన్నారు. గత యుద్ధాలతో పోలిస్తే రాబోయేవి భిన్నంగా ఉంటాయన్నారు. దాని కోసం ప్రిపేరై ఉండాలన్నారు.
Delhi: Responding to ANI’s question on the losses suffered by Pakistan during Operation Sindoor, Indian Air Force Chief Air Chief Marshal AP Singh says, “…As far as Pakistan’s losses are concerned…we have struck a large number of their airfields and we struck a large number… pic.twitter.com/tL2Gme49TQ
— ANI (@ANI) October 3, 2025
పాకిస్థాన్లో ఉన్న అనేక ఎయిర్ఫీల్డ్లను టార్గెట్ చేశామని, ఆ దాడుల కనీసం నాలుగు ప్రదేశాల్లోని రేడార్లు, రెండో చోట్ల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రెండు చోట్ల రన్వేలు ధ్వంసం అయినట్లు ఏపీ సింగ్ వెల్లడించారు. మూడు వేర్వేరు స్టేషన్లకు చెందిన మూడు హ్యాంగర్లు కూడా ధ్వంసమైనట్లు చెప్పారు. సీ-130 క్లాస్ విమానంతో పాటు నాలుగైదు యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయన్నారు. వీటిల్లో ఎఫ్-16లు ఉన్నట్లు చెప్పారు. ఆ సమయంలో వాటిని మెయింటెనెన్స్ చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. పాక్కు చెందిన ఓ ఎస్ఏఎమ్ సిస్టమ్ కూడా ధ్వంసమైందన్నారు. ఓ సుదీర్ఘ దాడి చేశామని, 300 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ను పేల్చామన్నారు. ఎఫ్-16, జేఎఫ్17 క్లాస్కు చెందిన అయిదు సిస్టమ్స్ను ధ్వంసం చేసినట్లు ఏపీ సింగ్ చెప్పారు.