వేసవి సంబురం సమీపించింది. అభిమానులకు నాన్స్టాప్ క్రికెట్ విందును పంచే ఐపీఎల్ వచ్చేస్తున్నది. సిక్సర్ల వర్షంతో పాటు ఉత్కంఠ పోరాటాలు, అద్భుత ప్రదర్శనలతో మాంచికిక్ ఇచ్చే మెగాలీగ్ మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9న ముంబై, బెంగళూరు మధ్య జరిగే తొలి పోరుతో లీగ్ సంగ్రామానికి తెరలేవనుండగా.. కరోనా నేపథ్యంలో బయో బబుల్ మధ్య ఖాళీ స్టేడియాల్లో కొత్త నిబంధనలతో ఈ సీజన్ జరుగనుంది. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు బబుల్లోకి వెళ్లగా.. క్వారంటైన్ ముగిసిన వెంటనే ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
నాలుగు రోజుల క్రితం వరకు ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్స్టోను భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలి బంతికే ఔట్ చేయాలని కోరుకున్న హైదరాబాదీ అభిమానులు ఇప్పుడు ఇద్దరూ సత్తాచాటాలని ఆకాక్షించనున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఆడిన ఈ ఇద్దరూ ఇక సన్రైజర్స్ హైదరాబాద్లో కలిసి బరిలోకి దిగనున్నారు. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మజా, స్పెషాలిటీ. ఇలా అంతర్జాతీయ స్థాయిలో కత్తులు దూసుకునే ఎందరో ప్లేయర్లు భుజాలపై చేతులు వేసుకొని నడిచే సమయం మళ్లీ సమీపిస్తున్నది. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలు, భారీ సిక్సర్లు, ఉత్కంఠ పోరాటాలు, ఊహాతీత విన్యాసాలతో క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభం కానుంది. స్టేడియాల్లోకి అనుమతి లేకున్నా.. టీవీల్లో మ్యాచ్లు చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో నిరీక్షిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్లోకి చాలా మంది ఆటగాళ్లు చేరుకున్నారు. వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. అయితే ఇంతకుముందే బబుల్లోకి వెళ్లిన వారు మాత్రం ముందుగానే కసరత్తులు చేయనున్నారు. కాగా కరోనా వైరస్ తీవ్రత కారణంగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీ.. మళ్లీ ఈ ఏడాది స్వదేశంలో సాగనుంది.
వేదికల కథ ఇదీ..
కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది లీగ్కు బీసీసీఐ ఆరు నగరాలనే ఎంపిక చేయగా.. జట్లన్నీ తటస్థ వేదికల్లోనే మ్యాచ్లు ఆడనున్నాయి. ఏప్రిల్ 9 నుంచి 25 వరకు మ్యాచ్లన్నీ ముంబై, చెన్నై వేదికగా జరుగనుండగా.. 26 నుంచి మే 8 వరకు అహ్మదాబాద్, ఢిల్లీల్లో సాగనున్నాయి. ఆ తర్వాతి లీగ్దశ మ్యాచ్లకు బెంగళూరు, కోల్కతా వేదికలు కానున్నాయి. ఇలా ఏకకాలంలో రెండు వేదికల్లో మ్యాచ్లు జరుగుతుండడంతో ఒక్కో చోట నాలుగు జట్లు ఉండనున్నాయి. తొలి అంచెలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు.. చెన్నైలో మ్యాచ్లు ఆడనుండగా.. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైలో తలపడనున్నాయి. కాగా మే 25 నుంచి జరిగే నాకౌట్ మ్యాచ్లతో పాటు 30న టైటిల్ పోరు అహ్మదాబాద్లో జరుగనుంది.
ఆర్సీబీ కిట్ స్పాన్స్ర్గా పూమా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అధికారిక కిట్ స్పాన్సర్గా ప్రముఖ సంస్థ పూమా వ్యవహరించనుంది. ఈ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పూమాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. మరోవైపు తొమ్మిదిరోజుల కండీషనింగ్ క్యాంపును మంగళవారం చెన్నైలో ఆర్సీబీ ప్రారంభించింది. కాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం జట్టుతో కలువనున్నాడు.
కొత్త రూల్స్ ఇవే..
ఈ ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ కొన్ని నూతన నిబంధనలను తెచ్చింది. ఇటీవల భారత్, ఇంగ్లండ్ సిరీస్ల్లో వివాదాస్పదమైన సాఫ్ట్ సిగ్నల్ పద్ధతికి మంగళం పాడింది. దీంతో నిర్ణయం కోసం మూడో అంపైర్ను ఆశ్రయించే సమయంలో ఫీల్డ్ అంపైర్ అభిప్రాయం పరిగణనలోకి రాదు. అయితే డీఆర్ఎస్లో అంపైర్ కాల్ మాత్రం యథావిధిగా కొనసాగనుంది. అలాగే బౌలింగ్ జట్టు 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సిందేనని కచ్చితమైన రూల్ తెచ్చింది. ఒకవేళ మ్యాచ్కు అంతరాయం ఏర్పడితే ఓవర్లను తగ్గిస్తామని వెల్లడించింది. అలాగే టై అయిన మ్యాచ్ ముగిసిన గంటలోగా సూపర్ ఓవర్ తంతు పూర్తి కావాల్సిందే. సూపర్ ఓవర్ కూడా టై కావడం, మళ్లీ నిర్వహించడం.. ఇలా జరిగినా 60 నిమిషాల్లోనే ప్రక్రియ ముగించాలని బీసీసీఐ నిర్ణయించింది. షార్ట్న్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకునేలా నిబంధన తెచ్చింది.
ఇవీ కూడా చదవండి
ఆటో డెబిట్ చెల్లింపులకు విఘాతం!
హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు