లక్నో, ఫిబ్రవరి 4: డబ్బుకు లొంగిపోయిన ఓ భారతీయ ఉద్యోగి దాయాది దేశం పాకిస్థాన్కు తొత్తుగా మారాడు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తూ అడ్డంగా దొరికాడు. ఉత్తరప్రదేశ్ హర్పూర్లోని షామాహియుద్దీన్పూర్కు చెందిన సతేంద్ర సివాల్ 2021 నుంచి మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఇండి యా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఐబీఎస్ఏ)గా పనిచేస్తున్నాడు.
అతడి కదలికలను అనుమానించిన అధికారులు ఎలక్ట్రానిక్, భౌతిక నిఘా పెట్టారు. పాక్ ఐఎస్ఐకి కీలక సమాచారం అందిస్తున్నట్టు గుర్తించిన ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్) తాజాగా అతడిని అరెస్ట్ చేసింది. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడని పేర్కొంది. లక్నోలోని ఏటీఎస్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ చేసినట్టు వివరించింది. సతేంద్ర సివాల్ డబ్బులకు కక్కుర్తిపడి రక్షణ, విదేశాంగశాఖ, మిలటరీ కార్యకలాపాలకు సంబంధించిన వ్యూహాత్మక కార్యకలాపాల రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నట్టు అధికారులు తెలిపారు.