న్యూఢిల్లీ: పాకిస్థాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ము కశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు పాకిస్థాన్ భారీ కాల్పులు జరిపింది. సరిహద్దు నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు ఎదురు కాల్పులు జరిపి.. ఉగ్రవాదులు చొరబడకుండా అడ్డుకున్నారని సైనిక వర్గాలు తెలిపాయి. ముందుగా పాక్ నుంచి కాల్పులు ప్రారంభం అయిన వెంటనే సరిహద్దు వెంట కాపలా కాస్తున్న సైనికులు ఎదురు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం సరిహద్దు వెంట గాలింపు చర్యలు చేపట్టగా ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కాల్పులు జరపడం ఇదే మొదటిసారి అని చెప్తుతున్నారు.