పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పులకు తెగబడగా, భారత సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు. జమ్ముకశ్మీర్లో భారీగా బలగాలను మోహరించారు. ఉగ్రమూకలను ఏరివేసిందుకు ఇళ్లు, అడవులను జల్లెడ పడుతున్నారు. బందిపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు, పారామిలిటరీ బలగాలకు రక్షణ శాఖ సెలవులను రద్దు చేసింది. సెలవుల్లో ఉన్న వారు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. పాకిస్థాన్ జాతీయులను గుర్తించి, వెంటనే వారి స్వదేశానికి పంపించివేయాలని అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆదేశించారు. మరోవైపు పాకిస్థాన్ కూడా ఎల్వోసీ వెంబడి భారీగా సైనికులను మోహరిస్తున్నది. బలూచ్, అఫ్గాన్ సరిహద్దుల్లో మోహరించిన జవాన్లను కూడా ఎల్వోసీకి తరలిస్తున్నది.
LOC | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి జమ్ముకశ్మీర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. వీటిని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని సైనిక వర్గాలు వెల్లడించాయి. దేశంలోని పారామిలిటరీ దళాలకు రక్షణ శాఖ సెలవులు రద్దు చేసింది. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
జమ్ములోని సుచేత్గఢ్ వద్ద భారత్-పాకిస్థాన్ సరిహద్దును పౌరులకు మూసివేశారు. సుచేత్గఢ్లోని ఆక్ట్రాయ్ పోస్టు వద్ద పౌర కదలికలను సరిహద్దు భద్రతా సిబ్బంది(బీఎస్ఎఫ్) శుక్రవారం నిలిపివేసింది. పంజాబ్లోని భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న అటారీ, హుస్సేనీవాలా, సడ్కీ వద్ద రిట్రీట్ కవాతులను రద్దు చేసినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించిన నేపథ్యంలో సుచేత్గఢ్ వద్ద తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుచేత్గఢ్లో కూడా రిట్రీట్ కవాతు జరగడం సంప్రదాయంగా వస్తోంది. భారత అంతర్జాతీయ సరిహద్దు ఉత్తరాన జమ్ము నుంచి ప్రారంభమై పంజాబ్, రాజస్థాన్ మీదుగా పశ్చిమాన గుజరాత్ వరకు వెళుతుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించబోమన్న భారత్ సంకల్పాన్ని తాజా పరిణామాలు ప్రతిబింబిస్తున్నాయి.
జమ్ముకశ్మీర్ పరిస్థితులపై చర్చించడానికి అన్ని సైనిక విభాగాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీరు వ్యాప్తంగా భద్రతా దళాలు మోహరించాయి. శ్రీనగర్లోని విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీరులో పరిస్థితిని సమీక్షించేందుకు భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు.
పహల్గాం ఉగ్ర దాడి దరిమిలా భారత్తో ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం శుక్రవారం గతన సిబ్బందికి ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. రానున్న రోజుల్లో ఎవరికీ కొత్త సెలవులు మంజూరు చేయవద్దని సైనిక త్రివిధ దళాలకు చెందిన కమాండర్లను ఆదేశించింది. గతంలో అఫ్గానిస్థాన్, బలూచిస్థాన్కు సరిహద్దు భద్రతను నిర్వహించిన సైనిక సిబ్బందిని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాక్ నియమించినట్లు కూడా వార్తలు వచ్చాయి. 10 కోర్ కమాండర్ పరిధిలోని భారత్-పాక్ వాస్తవాధీన రేఖ సమీపంలో గణనీయమైన సంఖ్యలో సైనిక సిబ్బందిని నియమించాలని బలూచిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో నియమించిన 11 కోర్, 12 కోర్కు చెందిన కమాండర్లను పాక్ సైన్యం ఆదేశించింది. భారత్ నుంచి చొరబాటు ఉండని కారణంగా గతంలో ఎన్నడూ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-పాక్ సరిహద్దు సైనిక బలగాలను పాక్ నియమించలేదు.
పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడిన అనుమానిత ఉగ్రవాదులను చూశానని ఓ మహిళ చెప్పడంతో జమ్ము కశ్మీర్లోని కథువాలో శుక్రవారం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేపట్టింది. పుల్వామా, బారాముల్లాలోనూ అనుమానిత టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతున్నది. భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థగా ఆరోపణలున్న జేకేఎన్ఎఫ్ కార్యకలాపాలపైనా సోదాలు ప్రారంభమయ్యాయి. పట్టాన్లోని గులామ్ మొహమ్మద్ గనేయి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. అక్కడ లభించిన జేకేఎన్ఎఫ్ సామగ్రిని సీజ్ చేశారు.