Indian devotees : పాకిస్థాన్ (Pakistan) లోని పవిత్ర క్షేత్రాలను సందర్శించాలనుకున్న 92 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం వీసాలు నిరాకరించింది. ఖల్సా సజ్నా దివస్ వేడుకల్లో భాగంగా గురుద్వారా పంజా సాహిబ్ (Gurudwara Panja Sahib) ను దర్శించుకునేందుకు వీరు సిద్ధమవగా, ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఖల్సా వాక్స్ న్యూస్ పోర్టల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ 92 మంది భక్తుల పేర్ల చివర సింగ్ లేదా కౌర్ లేనప్పటికీ, వీరంతా పది మంది సిక్కు గురువులపై ప్రగాఢ విశ్వాసం ఉన్నవారని ఖల్సా వాక్స్ కథనంలో సుదీప్ సింగ్ పేర్కొన్నారు.
మొదట ఏప్రిల్ 10 నుంచి 19 వరకు వీరికి వీసాలు మంజూరు చేసిన పాకిస్థాన్.. ఆ తర్వాత వాటిని రద్దు చేయడం భారతీయ కుటుంబాల మత విశ్వాసాలను దెబ్బతీసిందని సుదీప్ సింగ్ విమర్శించారు. హిందూ సమాజాన్ని గురుద్వారాల నుంచి దూరం చేసేందుకు పాకిస్థాన్ పన్నిన వ్యూహాత్మక చర్యగా ఇది కనిపిస్తోందని సుదీప్ సింగ్ ఆరోపించారు. హిందూ, సిక్కు కుటుంబాల మధ్య బంధాన్ని ఎవరూ విడదీయలేరని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు సిక్కులపట్ల సానుభూతి నటిస్తూనే, మరోవైపు ఐఎస్ఐ ద్వారా భారత్లోకి డ్రగ్స్, ఆయుధాలు పంపిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
ఈ వీసాల రద్దు అంశాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ విదేశీ వ్యవహారాల సలహాదారు పరమ్జిత్ సింగ్ చందోక్ తెలిపినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విధానాల ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వం గురుద్వారాలలోకి వీరి ప్రవేశాన్ని కూడా నిరోధించవచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయని సుదీప్ సింగ్ అభిప్రాయపడ్డారు.