శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు (India Pakistan) కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ము కశ్మీరులోని ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పాకిస్థానీ దళాలు వరుసగా తొమ్మిదో రోజూ కాల్పులకు తెగబడ్డాయి. కుప్వారా, ఉరి, అఖ్నూర్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. వీటిని భారతీయ సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు. భారత్, పాకిస్థాన్కు చెందిన డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓస్) మధ్య ఇటీవల హాట్లైన్ ద్వారా చర్చలు జరిగిన తర్వాత పాక్ నుంచి ఈ తరహా కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరగడంపై భారత్ హెచ్చరించింది.
ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత పోస్టులే లక్ష్యంగా చిన్న చిన్న ఆయుధాలతో పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. అయితే వీటిని భారత సైన్యం తిప్పికొడుతున్నది.