కర్నాటకలోని హిజబ్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఈ వివాదం ఇప్పుడు దేశం దాటింది. పాకిస్తాన్ కూడా స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. హిజబ్ ధరించిన కారణంగా మహిళలను విద్య నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది మానవహక్కులను హరించడమే అవుతుందని పాక్ విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు. ‘ముస్లిం పిల్లలను చదువు సంధ్యల నుంచి దూరం చేయడం అంటే.. మావన హక్కులను హరించడమే. ఓ వ్యక్తి ప్రాథమిక హక్కులను హరించడం సరైన విధానం కాదు. హిజబ్ ధరించిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం అంటే అణచివేయడమే. ఇలా చేయడం ద్వారా ముస్లింలను గుప్పిట్లో పెట్టుకోవాలని భారత ప్రభుత్వం చూస్తోంది’ అంటూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ట్వీట్ చేశారు.
మరోవైపు హిజబ్ వివాదం ముదురుతోంది. ఓ విద్యార్థినికి చెందిన వీడియో వైరల్ కావడంతో ఇది మరింత ముదురుతోంది. హిజబ్ ధరించిన ఓ విద్యార్థిని కాలేజీలోకి వస్తుండగా.. దానిని తీసేయాలంటూ మరో వర్గం వారు డిమాండ్ చేశారు. జై శ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. వీటికి ప్రతిగా ఆమె అల్లాహో అక్బర్ అంటూ నినాదమిచ్చింది. పరిస్థితి విషమించడంతో కాలేజీ యాజమన్యం రంగ ప్రవేశం చేసింది. ఇక.. షిమోగాలో 144 సెక్షన్ కొనసాగుతూనే వుంది.