శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రియాస్ (Reasi) వద్ద బస్సుపై దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది. రియాస్లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాకు వెళ్తున్న భక్తుల బస్సుపై ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. ఈ దాడిలో పది మంది భక్తులు మరణించగా, మరో 33 మంది గాయపడ్డారు. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఆ దాడికి బాధ్యతవహిస్తూ టీఆర్ఎఫ్ ప్రకటించింది. గతంలో కూడా రాజౌరీ, పూంఛ్, రియాస్లలో ఎత్తయిన కొండ ప్రాంతాల్లో చెట్ల పొదలమాటున దాక్కొని ఉగ్రవాదులు ఈ తరహా దాడులు పాల్పడ్డారు. తాజా కాల్పులు ఘటనలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, బస్సులోని ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్కు చెందినవారని, మృతులను ఇంకా గుర్తించలేదని పోలీసులు చెప్పారు.
గతేడాది జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మేరకు నిర్ణయం తీసుకున్నది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆన్లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఇది పాకిస్థాన్లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నది. కాగా, లష్కరే తోయిబా, తెహ్రీక్ ఈ మిలిటెంట్ ఇస్లామియా, ఘజ్నవి హింద్ సంస్థల కలయికే టీఆర్ఎఫ్. అయితే ఆ సంస్థకు ఎటువంటి మతపరమైన ఉద్దేశాన్ని కట్టబెట్టవద్దు అన్న ఆలోచనతో దానికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టినట్లు తెలుస్తున్నది.