పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై మండిపడ్డారు. చాలా మంది పిల్లలకు ఆయన జన్మనిచ్చారని, వంశపారంపర్య రాజకీయాల కోసం వారికి శిక్షణ ఇస్తున్నారని విమర్శించారు. తన కుటుంబ సభ్యులను మాత్రమే లాలూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శనివారం కతిహార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నితీశ్ కుమార్ మాట్లాడారు. లాలూ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు తన భార్యను బీహార్ ముఖ్యమంత్రిగా నియమించారని అన్నారు.
కాగా, ప్రస్తుతం తన పిల్లలను లాలూ ప్రమోట్ చేస్తున్నారని నితీశ్ కుమార్ విమర్శించారు. ‘నువ్వు చాలా మంది పిల్లలను కన్నావు. ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడం అవసరమా? ఎవరైనా చాలా మంది పిల్లలను కంటారా?’ అని ప్రశ్నించారు.
మరోవైపు ప్రస్తుతం తన కుమార్తెలు, ఇద్దరు కుమారులు, కుటుంబంలోని ప్రతి ఒక్కరిని రాజకీయాల్లోకి లాలూ తీసుకువచ్చారని నితీశ్ కుమార్ విమర్శించారు. ‘వారు ప్రతిచోటా ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ప్రజలు పాత విషయాలు మరచిపోతారు. కాబట్టి, ఏ పనీ జరుగదని అందరికీ చెప్పాలనుకుంటున్నా. ప్రజలు బయటకు రాలేకపోయారు. రోడ్లు కాని విద్య కాని లేవు’ అని లాలూ వారసత్వ రాజకీయాలపై మండిపడ్డారు.