Pahalgam attack : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి (Terror attack) కి సంబంధించి తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి సమయంలో ఉగ్రవాదులు ‘గో ప్రో హీరో 12 కెమెరా (GoPro Hero 12 Camera)’ లను ఉపయోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుర్తించింది. చైనాకు చెందిన ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వద్ద ఈ ‘గో ప్రో’ కెమెరాలు ఉన్నట్లు తెలుసుకుంది.
దాంతో ఉగ్రదాడికి వాడిన ‘గో ప్రో’ కెమెరాలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను తెలుసుకునేందుకు చైనా సాయం కోరాలని ఎన్ఐఏ భావిస్తోంది. అందుకు జమ్ముకశ్మీర్లోని ప్రత్యేక న్యాయస్థానం నుంచి తాజాగా అనుమతులు లభించాయి. ఘటనా స్థలం నుంచి ‘గో ప్రో హీరో 12 మోడల్ బ్లాక్ కెమెరాల’ ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఈ కెమెరాల్లోని సమాచారం బయటికి తీయగలిగితే.. దాడికి ముందు ఉగ్రవాదుల కదలికలు, ప్రణాళికల గురించి తెలుసుకోవడంలో ఇవి కీలకంగా మారనున్నాయి.
గత ఏడాది ఏప్రిల్ 18న పహల్గాం ఉగ్రదాడి జరిగింది. దానికి ఏడాది ముందు చైనాకు చెందిన ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వద్ద ఈ ‘గో ప్రో కెమెరాలు’ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2024 జనవరి 30న చైనాలోని డోంగ్వాన్లో ఈ కెమెరాలు యాక్టివేట్ అయినట్లు ఎన్ఐఏ అధికారులు తెలుసుకున్నారు. ఆ తర్వాత కెమెరా తయారీదారు ‘గో ప్రోబీవీ’ కి నోటీసులు జారీచేశారు. అయితే వాటి లావాదేవీలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తయారీదారులు పేర్కొన్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో వీటిని ఎవరు కొనుగోలు చేశారు..? చివరిగా ఎవరు వినియోగించారు..? అనే వివరాలు తెలుసుకోవడానికి చైనా సాయం కోరేందుకు ఎన్ఐఏ సిద్ధమైంది. దీనికి సంబంధించి చైనా న్యాయశాఖ అధికారికి లేఖ రాయనుంది. అందుకు భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి.