Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. అంతేగాక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. పహల్గాంలో ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో తన సన్నద్ధతను చాటేందుకు ఇండియన్ నేవీ తాజా పరీక్షలు నిర్వహించింది.
సముద్రజలాల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు తాము సిద్ధమని ఇండియన్ నేవీ ప్రకటించింది. మూడు రోజుల క్రితం కూడా భారత్ ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎంఆర్-ఎస్ఏఎం) తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ అయిన ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
ఈ విషయాన్ని ఇండియన్ నేవీ సోషల్ మీడియాలో తెలిపింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతితక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు లాంటి వాటిని సీ స్కిమ్మింగ్ లక్ష్యాలుగా పేర్కొంటారు.