న్యూఢిల్లీ, జనవరి 25 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు- 2026ను ఆదివారం ప్రకటించింది. బాలీవుడ్కు విశేష సేవలందించిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం)కు పద్మ విభూషణ్ ప్రకటించారు. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ (మరణానంతరం), సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్, వయోలిన్ విద్వాంసురాలు ఎన్ రాజం, ప్రముఖ మలయాళ జర్నలిస్ట్ పి. నారాయణన్కు కూడా పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సొరేన్, ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయుడు సహా 13 మందికి పద్మభూషణ్ ప్రకటించారు. ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ, భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సహా 113 మంది పద్మశ్రీ పురస్కారం లభించింది. ప్రముఖ తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను హతమార్చిన ఎప్టీఎఫ్కు నేతృత్వం వహించిన సీఆర్పీఎఫ్ మాజీ డీజీ కే విజయ్ కుమార్ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. మొత్తంగా ఈ ఏడాది 131 మందికి పద్మ అవార్డులు దక్కాయి. మొత్తం అవార్డు గ్రహీతల్లో 90 మంది మహిళలు ఉన్నారు. జాబితాలో విదేశీయులు, ఎన్ఆర్ఐ, పీఐవో, ఓసీఐ క్యాటగిరీ కింద ఆరుగురికి అవార్డులు ప్రకటించారు. మరణానంతరం 16 మందికి అవార్డులు ప్రకటించారు.
తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్), దీపికా రెడ్డి (నృత్యకారిణి), గూడూరు వెంకట్రావు (వైద్యం), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్, ఇంజినీరింగ్), కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజినీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం), రామారెడ్డి మామిడి (మరణానంతరం) (పశు సంవర్ధక, పాడి పరిశ్రమ) ఉన్నారు. యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది. ఏపీ నుంచి నటుడు గద్దె బాబూ రాజేంద్రప్రసాద్ (కళలు), మాగంటి మురళీ మోహన్ (కళలు), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం)కి పద్మశ్రీ ప్రకటించారు.
పద్మశ్రీ అవార్డుల్లో గుర్తింపు పొందని వీరుల (అన్సంగ్ హీరోస్) విభాగంలో అతి పెద్ద ఉచిత గ్రంథాలయాన్ని నెలకొల్పిన మాజీ బస్ కండక్టర్ అంకె గౌడ, ఆసియాలోనే మొదటి మానవ మిల్క్ బ్యాంక్ను స్థాపించిన పిల్లల వైద్య నిపుణురాలు అర్మిదా ఫెర్నాండెజ్, అరుదైన వాద్యం వాయించే 90 ఏండ్ల సంగీతకారుడు భిక్లయ లడ్క్య దిండా ఉన్నారు. కర్ణాటకకు చెందిన అంకె గౌడ 20 భాషల్లోని 20 లక్షల పుస్తకాలు సేకరించి ప్రజల కోసం ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆసియాలోనే మొట్టమొదటి మానవ పాల బ్యాంక్ వ్యవస్థాపకురాలిగా మహారాష్ట్రకు చెందిన శిశువైద్యురాలు ఆర్మిడా ఫెర్నాండెజ్ పేరు పొందారు. మహారాష్ట్రకు చెందిన సంగీతకారుడు భిక్లయ లడ్క్య దిండా సొరకాయ బుర్ర, వెదురుతో తయారు చేసిన తర్పా అనే అరుదైన వాద్యాన్ని వాయించడంలో నేర్పరి. ఈ క్యాటగిరీలో మొత్తం 45 మందికి పద్మశ్రీ అవార్డు దక్కింది.
