న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు పరిస్ధితిపై కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చడంతో పాటు దిశారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. లడఖ్లో ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతంపై చైనా చేస్తున్న ప్రకటనలను ఆక్షేపించారు. డ్రాగన్ చెబుతున్నది వాస్తవమేనా అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అది నిజమైతే రెండు దశలుగా సాగిన సరిహద్దు చర్చలు ఏమిటన్నది కేంద్రం వెల్లడించాలని అన్నారు. లడఖ్ సరిహద్దు పరిస్ధితిపై తాను పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తానని ఓవైసీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
గతంలో భారత సైనికులు పెట్రోలింగ్ చేసిన ప్రాంతాల్లో వారిని చైనా అనుమతించడం లేదని పార్లమెంట్ వేదికగా తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించానని చెప్పారు. దేశ భద్రత వంటి సున్నిత అంశాలపై ప్రభుత్వ తీరు ఆమోదయోగ్యం కాదని దుయ్యబట్టారు. లడఖ్ సరిహద్దు సంక్షోభం, చైనాకు చెక్ పెట్టే వ్యూహంపై పార్లమెంట్లో సరైన చర్చ అవసరమని ఓవైసీ పట్టుబట్టారు. ఈ విషయంలో ఎంపీలను ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోకపోవడం దేశ ప్రయోజనాలకు విఘాతమని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ దేశాన్ని విభజించేలా వ్యవహరిస్తున్న తీరు విదేశీ ప్రత్యర్ధులను ఎదుర్కొనే జాతి సత్తాను బలహీనపరుస్తోందని అన్నారు. భారతీయులందరినీ కులం, మతం, లింగ, భాష వంటి వ్యత్యాసాలకు అతీతంగా ఏకం చేసేలా సమైక్య సమాజం నిర్మించేందుకు ప్రధాని మోదీ నిరాకరిస్తున్నారని, అధికార దాహంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. బ్రహ్మోస్ మిస్సైల్ పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన ఘటననూ ఓవైసీ ప్రస్తావించారు.