Assembly Election Results: ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి కారణం ఆ పార్టీ అతివిశ్వాసమే అని త్రిపుర సీపీఐ (ఎం) నాయకుడు జితేంద్ర చౌదరి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల (మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్)లో హస్తం అస్తవ్యస్తమైన ఫలితాలను మూటగట్టుకున్న నేపథ్యంలో త్రిపుర సీపీఐ(ఎం) సెక్రటరీ జితేంద్ర చౌదరి స్పందిస్తూ ఈ వ్యాఖ్లు చేశారు. జితేంత్ర చౌదరి మాట్లాడుతూ… ఇటీవలే ముగిసిన ఎన్నికలలో మేమంతా బీజేపీపై కలిసికట్టుగా పోరాడదామని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ మాత్రం మా ప్రతిపాదనను పట్టించుకోకుండా ఒంటరిగా పోటీ చేసి కీలక ఎన్నికలలో విఫలమైంది. అతి విశ్వాసమే ఆ పార్టీని ముంచింది. ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకుంటుందని ఆశిస్తున్నాం.. అని అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు (60 సీట్లు) కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ గెలుచుకున్న కాంగ్రెస్.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో ఓటమి పాలైంది. మధ్యప్రదేశ్లో మినహా మిగిలిన రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఓటమిని మూటగట్టుకుంది. సోమవారం వెలువడిన ఈశాన్య రాష్ట్రం మిజోరం ఫలితాలలో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడింది. ఆ రాష్ట్రంలో హస్తానికి ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపబోవని, తమ కూటమి (ఇండియా) ఆధ్వర్యంలో బీజేపీని ధీటుగా ఎదుర్కుంటామని జితేంద్ర చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.