లక్నో: తల్లి మరణించడంతో అందిన బీమా సొమ్ములో వాటా కోసం ముగ్గురు సోదరుల మధ్య ఫైట్ జరిగింది. (Brothers Fight) ఈ కోట్లాటలో తీవ్రంగా గాయపడిన తమ్ముడు చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ్ తోలా ప్రాంతానికి చెందిన రామ్రాణి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్కు సంబంధించిన రూ.2 లక్షలు పెద్ద కుమారుడు రాజబహదూర్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి.
కాగా, తల్లి చనిపోవడంతో అందిన బీమా సొమ్ములో వాటా కోసం ముగ్గురు సోదరుల మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఇది మరింత ముదరడంతో గురువారం రాత్రి ముగ్గురు అన్నాదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారు కర్రలతో కొట్టుకున్నారు. కనిష్ట సోదరుడైన 45 ఏండ్ల రామ్ ఆస్రే ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు అన్నలపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరి కోసం పోలీసులు వెతుకుతున్నారు.