తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ను తొలగించాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు విద్రోహపూరితమని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ను కేబినెట్ నుంచి తొలగించాలంటూ సీఎం పినరయి విజయన్కు లేఖ రాశారు. ‘మంత్రి బాలగోపాల్ గత బుధవారం తిరువనంతపురంలోని యూనివర్సిటీ క్యాంపస్లో మాట్లాడుతూ ప్రాంతీయవాదాన్ని లేవనెత్తారు. ఐక్యతను దెబ్బతీయాలని కోరుతూ ప్రసంగించారు’ అని ఆ లేఖలో ఆరోపించారు.
కాగా, విద్యాశాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, మరికొందరు కూడా తనపై మాటల దాడులు చేశారని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆరోపించారు. ‘అయితే నన్ను వ్యక్తిగతంగా బాధపెట్టినందున వారిని విస్మరిస్తున్నాను. కానీ, ఆర్థిక మంత్రి కేఎఎస్ బాలగోపాల్ చేసిన విద్రోహ వ్యాఖ్యలను పట్టించుకోకపోతే, నా బాధ్యతను విస్మరించినట్లవుతుంది’ అని సీఎం విజయన్కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.