న్యూఢిల్లీ: భారత్ ఎన్నికల్లో ఇజ్రాయెల్ బృందం జోక్యంపై ఒక రిపోర్ట్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ మండిపడింది. దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా దేశాల ఎన్నికల్లో ఇజ్రాయెల్ కాంట్రాక్ట్ బృందం ‘టీమ్ జార్జ్’ జోక్యం చేసుకున్నట్లు అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం ఒక పరిశోధనాత్మక నివేదికను బుధవారం విడుదల చేసింది. హ్యాకింగ్, సమాచార విధ్వంసం, తప్పుడు సమాచారం వ్యాప్తి ద్వారా ఆయా దేశాల ఎన్నికలను ప్రభావితం చేసినట్లు అందులో ఆరోపించింది.
ఇజ్రాయెల్ ప్రత్యేక దళంలో గతంలో పని చేసిన 50 ఏళ్ల తాల్ హనాన్ ‘జార్జ్’ అనే మారు పేరుతో ప్రైవేటుగా ఈ పని చేస్తున్నట్లు జర్నలిస్టుల కన్సార్టియం పేర్కొంది. ఆయన నేతృత్వంలోని ‘టీమ్ జార్జ్’ పలు దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు ఆ నివేదికలో ఆరోపించింది. సోషల్ మీడియాలో నకిలీ ప్రచారం ద్వారా బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్, మెక్సికో, సెనెగల్, ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి పలు దేశాల ఎన్నికలను ‘జార్జ్’ బృందం ప్రభావితం చేసినట్లు పేర్కొంది. బ్రిటన్లోని ‘ది గార్డియన్’ వంటి 30 గ్లోబల్ మీడియా సంస్థల రిపోర్టర్లతో కూడిన అంతర్జాతీయ కన్సార్టియం ఈ మేరకు ఒక పరిశోధన రిపోర్ట్ను బుధవారం విడుదల చేసింది.
కాగా, ఈ రిపోర్ట్పై కాంగ్రెస్ పార్టీ గురువారం స్పందించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. ఇజ్రాయెల్కు చెందిన ‘టీమ్ జార్జ్’తో ప్రధాని మోదీ చేతులు కలిపారని, దేశంలోని ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని ఆరోపించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డిన్, జీ మెయిల్ వంటి వాటిని విస్తృతంగా ఉపయోగించి ఇజ్రాయెల్ టీమ్ ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నారని విమర్శించారు. ‘జార్జ్ టీమ్’ కార్యాచరణకు బీజేపీ ఐటీ సెల్ అద్దం పడుతున్నదని సుప్రియా మండిపడ్డారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ఫాలోవర్లలో 60 శాతం నకిలీలేనని విమర్శించారు. దేశ ఎన్నికల ప్రక్రియను నేరుగా ప్రభావితం చేస్తున్న ఈ అంశంపై దర్యాప్తు జరుగాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్పై ఇటీవల వచ్చిన ఆరోపణలను ఈ నివేదికతో లింక్ చేశారు. అదానీకి చెందిన ఎన్ని కంపెనీలు మోడీ ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చాయి? వాటిని ఎక్కడ ఖర్చు చేశారు? పెగాసస్, జార్జ్ కోసమా? అని పలు ప్రశ్నలు సంధించారు. తప్పుడు సమాచారంతో దేశ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్న ఈ వ్యూహాత్మక వ్యవస్థను ఛేదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు చేతులు కలపాలని ఆయన కోరారు. అలాగే బీబీసీ కార్యాలయాల్లో కేంద్రం చేయిస్తున్న ఐటీ సర్వేపై కూడా ఆయన మండిపడ్డారు.