లక్నో: భూ పరిహారం కోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. (Farmers’ stir) ఎన్టీపీసీ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఉంచిన బారీకేడ్ల పైనుంచి దూకేందుకు మహిళా రైతులు యత్నించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. దాద్రీలో పవర్ప్లాంట్ ఏర్పాటు కోసం 1980లో పలు గ్రామాల నుంచి భారీగా వ్యవసాయ భూములను సేకరించారు. అయితే కొంతకాలంగా పరిహారం చెల్లింపు కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు. 105 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు గత 18 రోజులుగా నోయిడా సెక్టార్-24లోని ఎన్టీపీసీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. శుక్రవారం ఎన్టీపీసీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు.
కాగా, రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే మహిళా రైతులు వాటి పైనుంచి దూకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. 64 శాతం అదనపు పరిహారంతోపాటు ప్లాట్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాకు పునరావాసం కల్పించాలని, ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నినాదాలు చేశారు.