ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలోని మంత్రుల విదేశీ టూర్లపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) మండిపడ్డారు. ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్, ఆ శాఖ అధికారులు అక్టోబర్ 3న బ్రిటన్కు వెళ్లనున్నారు. అక్కడి మ్యూజియంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్కు చెందిన పులి పంజా ఆకారంలో ఉన్న ఆయుధం ‘వాఘ్ నఖ్’ను మహారాష్ట్రకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆయుధాన్ని ఇక్కడే శాశ్వతంగా ఉంచుతారా లేదా అని ఆదిత్య ఠాక్రే ప్రశ్నించారు. అలాగే పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనేందుకు నాలుగు నెలల ముందే దావోస్కు ఎందుకు వెళ్తున్నారని నిలదీశారు.
కాగా, మండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలం గోర్హే నేతృత్వంలో 50 మంది సభ్యుల విదేశీ టూర్ను ఆదిత్య ఠాక్రే ప్రశ్నించారు. వారు ఏమి స్టడీ చేశారని నిలదీశారు. డబ్బును స్వాహా చేసేందుకేనని విమర్శించారు. అలాగే తన ట్వీట్కు స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తమ విదేశీ పర్యటనలను విరమించుకున్నారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జపాన్ టూర్ వ్యయాన్ని షిండే ప్రభుత్వం భరించడాన్ని తప్పుపట్టారు.