ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. షిండే తిరుగుబాటుకు ముందు అవిభాజ్య శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు గత ఏడాది జూన్ 23న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివసేనలో తిరుగుబాటు చేసి అనంతరం సీఎం అయిన షిండేతోపాటు ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అనర్హతపై గత ఏడాది జూలైలో మరో రెండు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది మే 11న ఆదేశాలు జారీ చేసింది.
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ రాహుల్ నార్వేకర్ పట్టించుకోవడం లేదని సునీల్ ప్రభు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్కు తాను మూడు లేఖలు రాసినస్పటికీ ఆయన స్పందించలేదని విమర్శించారు. షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. నోటీసులు జారీ చేసి రెండు వారాల్లో సమాధానం కోరుతామని పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.