న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఎంపీ నివాసం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మురికివాడల కూల్చివేతపై మండిపడ్డారు. శనివారం ఉదయం ఢిల్లీలోని లోధి రోడ్డులో ఉన్న బీజేపీ ఎంపీ రమేష్ బిధురి నివాసం వద్దకు ఆప్ ఎమ్మెల్యేలు, మురికివాడల నివాసితులు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ధర్నాకు దిగారు. తుగ్లకాబాద్ వంటి దక్షిణ ఢిల్లీ పరిసరాల్లోని మురికివాడల కూల్చివేతను వ్యతిరేకించారు. ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, మదన్ లాల్, కతర్ సింగ్ తన్వర్, సాహిరామ్ పహల్వాన్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ‘సిగ్గులేని బీజేపీ, మురికివాడల కూల్చివేతలు ఆపండి’ అంటూ మురికివాడల ప్రజలు ఫ్లకార్డులను ప్రదర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల సందర్భంగా మురికివాడల ప్రజలకు ఉచితంగా ఫ్లాట్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఆప్ ఎమ్మెల్యే అతిషి గుర్తు చేశారు. అయితే ఆ ఎన్నికలు ముగియడంతో మురికివాడల నివాసితుల ఇళ్లను కూల్చాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటీసులు పంపుతున్నదని విమర్శించారు. తుగ్లకాబాద్లోని ఒక స్లమ్ ఏరియాకు కూడా నోటీసులు పంపారని, 15 రోజుల్లో ఖాళీ చేయాలంటూ నివాసితులను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.