అహ్మదాబాద్: మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్లో (Ahmedabad) వన్డే ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) మ్యాచ్ జరుగనుంది. టోర్నీలో ఓటమినే ఎరుగని టీమ్ఇండియా, ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా తుదిపోరులో తలపడనున్నాయి. లక్షా ముప్పై వేల మంది అభిమానులు, ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు, అసోం ముఖ్యమంత్రులతోపాటు అతిరతమహారథులు ఈ మెగా ఫైనల్కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 6 వేలకుపైగా మంది సిబ్బందిని మోహరించింది. స్టేడియంతోపాటు ఆటగాళ్లు బసచేస్తున్న హోటళ్లు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తారని అహ్మదాబాద్ కమిషనర్ జీఎస్ మాలిక్ చెప్పారు. వీరిలో గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), హోమ్గార్డులు, ఇతర ఇబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నామని తెలిపారు.
మొత్తం 6 వేల మందిలో 3 వేల మంది స్టేడియం లోపల మోహరించామని, మిగిలినవారిని స్టేడియ బయట, నగరంలో మోహరించామన్నారు. ఐపీఎస్ ర్యాంక్ కలిగిన 23 మంది ఐజీ, డీఐజీ, డిప్యూటీ పోలీస్ కమిషనర్లు, 39 మంది మంది కమిషనర్లు, 92 మంది ఇన్స్పెక్టర్లు భద్రతను పర్యవేక్షిస్తారని వెల్లడించారు. అదేవిధంగా చేతక్ కమాండోలతోపాటు బాంబ్ స్క్వాడ్కు చెందిన 10 టీమ్లు స్టేడియం పరిసరాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
లక్షా 30 వేల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరొందిన ఈ వేదికలో ప్రతిష్ఠాత్మక పోరు కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరోవైపు ఫైనల్ రోజున పలు కార్యక్రమాలకు బీసీసీఐ రూపకల్పన చేసింది. మధ్యాహ్నం 12.30కు స్టేడియంపైన 10 నిమిషాల పాటు సూర్యకిరణ్ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. వింగ్ కమాండర్ సిదేశ్ కార్తీక్ నేతృత్వంలో తొమ్మిది విమానాలు రకరకాల విన్యాసాలతో కట్టిపడేయనున్నాయి. సాయంత్రం 5.30కు ఇప్పటి వరకు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానించనుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ నేతృత్వంలో 500 మందికి పైగా డ్యాన్సర్లు వివిధ సూపర్హిట్ పాటలకు నృత్యాలు చేయనున్నారు. యూకేకు చెందిన ఎల్ఎమ్ ప్రొడక్షన్స్..స్టేడియంలో లేజర్ షోతో ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకుపోనుంది.