ముంబై : రూ.500కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, కోటికిపైగా విదేశీ సిగరేట్లను కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేశారు. ఇందు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇంతకు ముందు పలుచోట్ల దాడులు చేసిన పట్టుకున్న ఈ డ్రగ్స్ను నవీ ముంబైలోని తలోజా ప్రాంతంలోని డంప్ యార్డ్ వద్ద ధ్వంసం చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ధ్వంసం చేసిన వాటిలో 293 కిలోల హెరాయిన్, 50 కిలోల మెఫెడ్రోన్ ఉన్నాయని వాటి విలు బహిరంగ మార్కెట్లో రూ.500కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ (జోన్-3) రాజేశ్ సనన్ తెలిపారు.
అలాగే 19 మెట్రిక్ టన్నుల విదేశీ సిగరెట్లు సైతం ధ్వంసం చేశామని, వాటి విలువ రూ.15కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPC) చట్టంలోని నిబంధనల ప్రకారం దాడులు చేసినట్లు పట్టుకున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయి డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రతినిధుల సమక్షంలో డ్రగ్స్ను ధ్వంసం చేసినట్లు వివరించారు.