భోపాల్: త్వరలో కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అరడజన్కు పైగా టీకాలు దేశంలో అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. మహమ్మారి ముప్పు తొలగిపోయినట్లు కాదన్నారు. అయితే కరోనా నియంత్రణకు ప్రజలంతా నిబంధనలు పాటించాల్సిందేనని శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంట్ హెల్త్ నూతన క్యాంపస్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ ‘కొవిడ్-19పై పోరు కోసం భారత్ రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంతోపాటు ఇప్పటివరకు 71దేశాలకు టీకాలను సరఫరా చేసింది. కెనడా, బ్రెజిల్ తదితర అభివృద్ధి చెందిన దేశాలు కూడా మన వ్యాక్సిన్లను వినియోగిస్తున్నాయి’ అని తెలిపారు. భారత్ను ‘విశ్వగురు’గా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని హర్షవర్ధన్ తెలిపారు.
వ్యాక్సిన్లపై రాజకీయాలు చేయడం సరికాదని, దీనిమంతా మనమంతా కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలనుద్దేశించి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ‘మన శాస్త్రవేత్తల కృషి అనిర్వచనీయం. వారి శ్రమ వల్లే మనం నేడు వ్యాక్సిన్ల ఘనత సాధించాం. 2020 అంటే కొవిడ్-19తో పాటు సైన్స్, శాస్త్రవేత్తల సంవత్సరంగా మనకెప్పటికీ గుర్తుండిపోతుంది’’అని కేంద్రమంత్రి వివరించారు. ఈ సందర్భంగా దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతిపై స్పందించిన ఆయన.. నిర్లక్ష్యం, అవగాహన లోపం వల్లే కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయన్నారు.