ఇంఫాల్: ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో (Manipur) రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ (Meitei community) ప్రజలకు ఎస్టీ (ST) హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ATSUM) చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లతో రాష్ట్రం అట్టుడికింది. హింసలో గ్రామాలకు గ్రామాలు తగలబడిపోయాయి. మైతీలు, గిరిజనుకు మధ్య పరస్సర దాడులు పెరడంతో రాష్ట్రం నుంచి చాలా మంది వలసబాటపట్టారు. మణిపూర్కు చెందిన 5800 మందికిపైగా మిజోరంలోని (Mizoram) వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారంతా చిన్ (Chin), కుకి (Kuki), మిజో (Mizo) తెగలకు చెందివారే ఉన్నారని చెప్పారు. వీరంతా మిజోరంలోని ఆరు జిల్లాల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరాల్లో తల దాటుకుంటున్నారని వెల్లడించారు.
ఇలా ఐజ్వాల్ (Aizawl) జిల్లాలో అత్యధికంగా 2021 మంది ఆశ్రయం పొందుతున్నారని, తర్వాత 1847 మందితో కొలాసిబ్, 1790 మందితో సైతువాల్ జిల్లాలు ఉన్నాయి. కాగా, గిరిజనుల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు ట్రైబల్ ఎమ్మెల్యేలు పట్టుబట్టాలని మిజోరం ఎంపీ సీ లార్లోసంగా (C Lalrosanga)సూచించారు. మణిపూర్ ప్రభుత్వం కింది గిరిజన ప్రజలు ఎక్కువకాలం మనుగడ సాగించలేరని ఆరోపించారు.
ఇంఫాల్ జిల్లాల్లో అడపా దడపా మిలిటెంట్ గ్రూపులకు, భద్రతా దళాలకు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హింసాత్మక పరిస్థితులకు అంకురార్పరణ మాత్రం కొన్ని నెలల నుంచి కొనసాగింది. మైతీ తెగలోకి చేరిన సంఘ్ పరివార్ శక్తులు ప్రస్తుత అల్లర్లకు ఆజ్యం పోసినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ వైఫల్యం, అధికార బీజేపీ విభజన వాదం, ఓట్ల రాజకీయాలు..అన్నీ కలిసి ప్రశాంతమైన ఈశాన్య రాష్ట్రంలో విద్వేషాగ్ని రగిలించాయి. ఇదే అదనుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై 355 అధికరణ ప్రయోగించి తన నియంత్రణలోనికి తెచ్చుకుంది. మొత్తం ఏడు కారణాలు మణిపూర్లో మంటలు రేపాయి.
మైతీ తెగకు రిజర్వేషన్ల ప్రయత్నం
రాష్ట్ర జనాభాలో 40 శాతంగా ఉన్న కుకీ, నాగా తెగ ప్రజల కన్నా 53 శాతంగా ఉన్న మైతీ తెగ ప్రజల ఓటు బ్యాంకే బీజేపీకి ముఖ్యమైంది. మైతీ తెగకు ఎస్టీ హోదా కల్పించే ప్రయత్నాలు జరగడం గిరిజన తెగలకు, విద్యార్థులకు ఆగ్రహం తెప్పించింది.
మిలిటెంట్లతో శాంతి చర్చలు రద్దు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా కుకీ-జోమి మిలిటెంట్ గ్రూపులతో శాంతి చర్చలను మార్చి నెలలో రద్దు చేసుకున్నాయి. దీని ద్వారా గిరిజనులకు స్వయం పాలనను అందించడం మైతీ తెగకు ఇష్టం లేదనే సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది.
గిరిజనులను వెళ్లగొట్టడం
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షిత అడవుల నుంచి కుకీ, నాగా తెగ గిరిజనులకు వెళ్లగొడుతున్నది. వారికి పునరావాసం కూడా సరిగా కల్పించడం లేదు. దీని వల్ల గిరిజనుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి.
చర్చిలపై దాడులు
గిరిజనులను వెళ్లగొట్టే క్రమంలో ప్రభుత్వం మూడు చర్చిలను ధ్వంసం చేసింది. మైతీ తెగకు చెందిన సీఎం బీరేన్ సింగ్ క్రిస్టియన్ మెజారిటీ జనాభా కలిగిన గిరిజనుల ప్రార్థనా స్థలాలపై ఈ చర్యలు చేపట్టడం కూడా అల్లర్లకు ఒక కారణమైంది. కొంత కాలంగా చర్చిలపై కొన్ని మూకలు దాడులు చేస్తున్నాయి. మైతీ తెగలోకి హిందూత్వ గ్రూపులు చొచ్చుకుపోయాయి.
క్రైస్తవులు-హిందువుల ఘర్షణగాచిత్రీకరించడం
మైతీ తెగ ప్రజల ఇండ్లను కొందరు దుండగులు దహనం చేశారు. బలవంతంగా బాధితులను భద్రత కోసం వేరే ప్రాంతాలకు వెళ్లేలా చేశారు. దీన్ని క్రైస్తవులు-హిందువుల మధ్య ఘర్షణగా చూపడం వల్ల అనేక మంది అమాయకులు అల్లర్లలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
వలసదారులతో భయం సృష్టించారు
మయన్మార్ నుంచి వలస వస్తున్న వారి వల్ల స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కుకీ తెగల మిలిటెంట్ నాయకుడు మయన్మార్ జాతీయుడని బీరేన్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఈ భయాన్ని మరింత పెంచుతున్నది.
తీవ్రవాదులపై డ్రగ్స్వ్యాపారం ఆరోపణలు
కుకీ తీవ్రవాదులు పాపి(గసాలు) పంటల సాగు చేపట్టి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారని సీఎం బీరేన్ విమర్శించారు. ఇది పూర్తిగా అబద్ధం కాదు. అయితే పర్వత ప్రాంతాల్లో ప్రభుత్వమే డ్రగ్స్ రవాణాకు, డ్రగ్ మాఫియా నాయకులకు మద్దతు ఇస్తున్నదని మాజీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఆరోపించారు.