అహ్మదాబాద్: గుజరాత్ ప్రజలు అధికార పార్టీకే మళ్లీ పట్టం కట్టారు. దీంతో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారాన్ని సొంతం చేసుకున్నది. అసెంబ్లీలోని 182 సీట్లలో 156 స్థానాలను దక్కించుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. నమోదైన మొత్తం ఓట్లలో 53 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకే పడ్డాయి. అయితే రాష్ట్రంలో నోటా గుర్తుకు కూడా భారీగా ఓట్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,01,202 మంది ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని తీర్పునిచ్చారు. ఇది మొత్తం నమోదైన పోలింగ్ శాతంలో 1.5 శాతం అన్నమాట. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే నోటా షేరింగ్ శాతం కాస్త తగ్గిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 2017లో 5,51,594 ఓట్లు నోటాకు వచ్చాయని తెలిపింది.
కాగా, ఈ సారి అత్యధికంగా ఖేడ్బ్రహ్మ నియోజకవర్గంలో 7331 ఓట్లు నోటాకు వచ్చాయి. ఇక డాంటాలో 5213 ఓట్లు, ఛోటా ఉదయ్పూర్లో 5093, దేవ్గధ్బారియాలో 4821, షెహ్రాలో 4708, నైజర్లో 4465, బర్డోలిలో 4211, వడోదరా సిటీ నియోజకవర్గంలో 4022 ఓట్లు నోటా గుర్తుకు పోలయ్యాయి.