ముంబై, ఏప్రిల్ 26: దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా రానున్న పదేండ్లలో 25 కోట్ల ఉద్యోగాలు సృష్టించి.. దేశంలో నిరుద్యోగ సమస్యను తరిమేస్తామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఎనిమిదేండ్లు గిర్రున తిరిగాయి. ఉద్యోగాల సృష్టి అటుంచితే, ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయి. అర్హతకు తగిన ఉద్యో గం దొరకని లక్షలాది మంది ఉద్యోగులు ఇంతకాలం చిన్నాచితక జాబ్స్ చేస్తూ నెట్టుకొచ్చారు. ఇక, మోదీ హయాంలో ఉద్యోగకల్పన ఎండమావేనని గ్రహించిన వాళ్లు.. శ్రామిక శక్తి నుంచి క్రమంగా వైదొలుగుతున్నారు. ముంబై కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ (సీఎంఐఈ) అనే ప్రైవేటు రిసెర్చ్ సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
దేశంలో ఉద్యోగాల కల్పన లేమి సమస్య మరింత తీవ్రమవుతున్నది. తమ అర్హతలకు తగినట్టు ఉద్యోగం దొరకని నేపథ్యంలో విసుగుచెందిన కోట్లాది మంది భారతీయులు, ప్రధానంగా మహిళలు ఉద్యోగాల వేటను ఆపేస్తున్నారు. దేశంలోని 90 కోట్ల మంది శ్రామిక శక్తిలో మెజార్టీ ప్రజలు ఉద్యోగాల కోసం ఎదురుచూడటాన్ని ఆపేశారని సీఎంఐఈ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా శ్రామిక శక్తి నుంచి మహిళలు వైదొలుగుతున్నారని పేర్కొన్నది. బీజేపీ హయాంలో ఇది మరింత పెరుగడం గమనార్హం.
నవ్య భారత్ సరికొత్త నినాదం.. హర్ ఘర్ బెరోజ్గారీ.. ఘర్ ఘర్ బెరోజ్గారీ (ప్రతీఇంట నిరుద్యోగం). 45 కోట్ల మందిలో ఉద్యోగం లభిస్తుందన్న ఆశను చచ్చిపోయేట్లు చేసిన మొట్టమొదటి ప్రధాని మోదీ. 75 ఏండ్లలో ఇది రికార్డు.
-కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ