భువనేశ్వర్: మరణించిన ఒక వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకునేందుకు అక్కడి గిరిజనులు రాత్రంతా నిద్రపోకుండా కాపలా కాశారు. ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఝరిగావ్ బ్లాక్ పరిధిలోని గుడిబానా గ్రామంలో భాత్రా తెగకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారు. కొన్నేళ్ల కిందట క్రైస్తవ మతంలోకి మారిన 65 ఏళ్ల జిత్రు భాత్రా శుక్రవారం మరణించాడు. అయితే ఆ గిరిజనుల సంప్రదాయం ప్రకారం బయటి వ్యక్తులు లేదా ఇతర మతాలకు చెందిన వ్యక్తులను గ్రామ శ్మశాన వాటికలో దహనం లేదా ఖననం చేయడానికి అనుమతించరు.
ఈ నేపథ్యంలో క్రైస్తవ మతానికి చెందిన జిత్రు భాత్రా మృతదేహానికి స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించడంపై ఆ గ్రామంలోని గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని అడ్డుకునేందుకు శుక్రవారం రాత్రంతా సుమారు 300 మంది గిరిజన పురుషులు మేల్కొన్నారు. గ్రామం శివార్లలో, శ్మశానవాటిక వద్ద కాపలా కాశారు.
కాగా, ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. ఆ వృద్ధుడి మృతదేహానికి సమీప గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని ఆ కుటుంబాన్ని కోరారు. దీంతో వృద్ధుడి మృతదేహాన్ని అక్కడకు తీసుకెళ్లగా అక్కడి గ్రామస్తులు కూడా అంత్యక్రియలకు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు జిల్లా కేంద్రమైన నబరంగ్పూర్ పట్టణానికి సమీపంలో ఉన్న చర్చికి ఆ మృతదేహాన్ని తరలించారు.
మరోవైపు గిరిజనుల ఆచారం ప్రకారం గ్రామంలో చనిపోయిన వారి అంత్యక్రియలు ముగిసే వరకు వారు ఆహారం ముట్టరు. అయితే ఆ వృద్ధుడి మృతదేహం గ్రామంలోని అతడి ఇంట్లో 24 గంటలపాటు ఉంది. దీంతో సుమారు వెయ్యి మంది ఆ గిరిజన పెద్దలు, పిల్లలు అప్పటి వరకు ఆహారం లేకుండా ఉన్నారని గ్రామ సర్పంచ్ తెలిపారు. కాగా, భాత్రా తెగకు చెందిన గిరిజనులు ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం నుంచి ఒడిశాకు వలస వచ్చినట్లు తెలుస్తున్నది.