గువాహతి: అస్సాంలోని పలు జైళ్లలో 200కు పైగా హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. ఎయిడ్స్ సోకిన ఖైదీలకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) చికిత్స అందిస్తున్నారు. అయితే అస్సాంలోని జైళ్లలో హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. (HIV Cases In Assam Jails) ఆ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31 జైళ్లలోని ఖైదీలకు హెచ్ఐవీ స్క్రీనింగ్ నిర్వహించారు. గత నాలుగు నెలల్లో 226 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గత వారం శ్రీభూమి జిల్లా జైలులో హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఈ జైలులో 445 మంది ఖైదీలు ఉండగా వారిలో 11 మందికి హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ 11 మందిలో ఒక మహిళా ఖైదీ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. తాజాగా శ్రీభూమి జిల్లా జైలులో హెచ్ఐవీ కేసులు బయటపడటం జిల్లా వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.
కాగా, అస్సాం జైళ్లలో హెచ్ఐవీ సోకిన 95 శాతం మంది ఖైదీలు ఇంజెక్షన్ ద్వారా మాదకద్రవ్యాలు తీసుకున్నవారేనని అధికారులు తెలిపారు. 31 జైళ్లలోని హెచ్ఐవీ పాజిటివ్గా ఉన్న 226 మంది ఖైదీలలో 202 మంది యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) చికిత్స పొందుతున్నట్లు వివరించారు.
మరోవైపు అస్సాం జైళ్లలోని ఖైదీలకు హెచ్ఐవీ సోకడం ఆందోళన కలిగిస్తున్నదని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. జైళ్లలోని ఖైదీలకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు. అస్సాంలో సుమారు 33,000 మంది హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ రోగులు ఉన్నారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్ వెల్లడించారు.