న్యూఢిల్లీ: ఆరు రోజుల్లోనే రెండు కోట్ల మందికిపైగా టీనేజర్లు కరోనా టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈనెల 3న 15-18 ఏండ్ల టీనేజర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించారు. దీంతో ఆరోగ్య కార్యకర్తలు విద్యా సంస్థల్లో విస్తృతంగా వ్యాక్సినేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఆరు రోజుల్లోనే 15 నుంచి 18 ఏండ్ల వయస్సున్న 2 కోట్లకుపైగా యువత టీకా తీసుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.
జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ అందిచనున్నట్లు ప్రధాని మోదీ గత డిసెంబర్ 26న ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. తొలి డోసు తీసుకున్న వారందరికి నాలుగు వారాల తర్వాత రెండో డోసు వేయనున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసులను పంపింణీచేసినట్లు ఆరోగ్య మంత్రి వెల్లడించారు. 2007, అంతకంటే ముందు జన్మించినవారు టీకా వేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు.