న్యూఢిల్లీ: దీపావళి పూజ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. (Women Shot in Delhi) తీవ్రంగా గాయపడిన వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. వాయువ్య ఢిల్లీలోని ఖేరా ఖుర్ద్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం దీపావళి పూజ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు గన్స్తో వారిపై కాల్పులు జరిపి పారిపోయారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరు మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఆస్తి తగాదాలు ఈ సంఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపిన నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.