న్యూఢిల్లీ, అక్టోబర్ 7: లఖింపూర్ ఖీరీ ఘటనకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదుచేసిన నిందితులు ఎవరు? వారిని అరెస్ట్ చేశారా? లేదా? అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ వివరాలతో శుక్రవారం ‘స్టేటస్ రిపోర్ట్’ను సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వివరాలను కూడా అందజేయాలని నిర్దేశించింది. యూపీలోని లఖింపూర్ ఖీరీలో ఈ నెల 3న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని వాహనాలు రైతులను తొక్కేస్తూ వెళ్లిపోయాయి. ఒక వాహనంలో అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. వాహనం కింద నలిగి ఇద్దరు రైతులు, దరిమిలా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మరో ఇద్దరు రైతులతో పాటు ఇంకో నలుగురు వ్యక్తులు మరణించారు. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ ఘటనల్లో దోషులను కాపాడేందుకు యూపీలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లఖింపూర్ ఖీరీ ఘటనపై గురువారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ప్రారంభించింది.
నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టుకు అందిన ఒక మెసేజ్ గురించి జస్టిస్ రమణ తెలిపారు. లవ్ప్రీత్ సింగ్ (లఖింపూర్ ఖీరీ ఘటనలో మరణించిన రైతు) తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కొడుకు మృతితో ఆమె షాక్ గురయ్యారన్నది ఆ మెసేజ్ సారాంశం. వెంటనే ఆమెకు వైద్య సహాయం అందించాలని యూపీ ప్రభుత్వాన్ని జస్టిస్ రమణ ఆదేశించారు.
జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు
లఖింపూర్ ఖీరీ ఘటనపై దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవతో ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ను యూపీ ప్రభుత్వం నియమించింది.
కేంద్రమంత్రి కొడుక్కి సమన్లు
లఖింపూర్ ఖీరీ కేసులో శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలీసు విచారణకు హాజరుకావాలని కేంద్రం మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ అయ్యాయి. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏడుగురిలో లవకుశ్, ఆశిష్ పాండే అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రదేశంలో రెండు ఖాళీ కార్ట్రిడ్జ్లు దొరికాయని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న నిందితులను అరెస్ట్ చేశారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించడం గమనార్హం. ఎఫ్ఐఆర్లో ఆశిష్ మిశ్రా పేరు కూడా ఉంది. లఖింపుర్ నగరంలోని కేంద్రమంత్రి ఇంటికి పోలీసులు సమన్లను అంటించారు.