న్యూఢిల్లీ, మార్చి 23: ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, రిమోట్ ఓటింగ్ ప్రతిపాదనపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల నేతలతో గురువారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్, శివసేన(ఠాక్రే వర్గం) నేత అనిల్ దేశాయ్, రాజ్యసభ స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్ హాజరయ్యారు. ఈవీఎంలు, రిమోట్ ఓటింగ్కు సంబంధించి తమ అనుమానాలకు ఎన్నికల సంఘం జవాబులు ఇవ్వాలని ఎంపీలు కోరారు.
వలస కార్మికుల కోసం రిమోట్ ఈవీఎంలను వినియోగించాలనే ఎన్నికల సంఘం ఆలోచనలను ప్రతిపక్ష పార్టీలన్నీ తిరస్కరిస్తున్నట్టు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రిమోట్ ఈవీఎంల పనితీరును ప్రదర్శించాలనుకుంటున్న ఈసీ నిర్ణయాన్ని సైతం వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈవీఎంల గురించే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈవీఎంలో అభ్యర్థుల పేర్లను ఇంటర్నెట్ ద్వారా చేర్చవచ్చని చెప్పడం అనుమానాలు కలిగిస్తున్నదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మదన్ లోకూర్ నేతృత్వంలో ఎన్నికలపై ఏర్పాటైన సిటిజెన్స్ కమిషన్ కూడా ఈవీఎంలపై పలు అనుమానాలు లేవనెత్తిందని, వాటికి కూడా ఎన్నికల సంఘం స్పందించలేదని ఆరోపించారు.
ఏ దేశంలో లేనిది ఇక్కడే ఎందుకు?
ఓటింగ్ ప్రక్రియలో ప్రపంచంలో ఏ దేశం కూడా ఈవీఎంలను వినియోగించడం లేదని, భారత్లోనే ఎందుకు వినియోగిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. చివరిసారిగా తాము ఈ విషయంంలో ఎన్నికల సంఘం వద్దకు వెళతామని, తమ అభ్యంతరాలను ఎన్నికల సంఘం పట్టించుకోకుంటే రాజకీయ కార్యాచరణకు దిగుతామని ఆయన పేర్కొన్నారు.