న్యూఢిల్లీ : విపక్ష పార్టీల ఇండియా కూటమి (INDIA Alliance) తదుపరి కీలక భేటీకి దేశ రాజధాని ఢిల్లీ వేదిక కానుంది. ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన ఇండియా విపక్ష కూటమి సమావేశాలు ముగిసిన అనంతరం ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదుపరి భేటీ ఢిల్లీలో జరుగుతుందని శుక్రవారం ప్రకటించారు. ఈ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే తేదీల వివరాలను ఆమె వెల్లడించలేదు.
ముంబైలో జరిగిన విపక్ష నేతల మూడో భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలో దిగాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. సమన్వయ కమిటీతో పాటు మరో నాలుగు కీలక కమిటీలను ప్రకటించాయి. సీట్ల సర్దుబాటు ప్రక్రియను వేగవంతం చేయాలని తీర్మానించాయి. మరోవైపు విపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు.
దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు. ఈ దశలో ఇండియా కూటమి దేశ జనాభాలో 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యవ వహిస్తోందని, రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఏకమైతే బీజేపీకి గెలుపు అసాధ్యమని, సమర్ధవంతంగా విపక్షాల కలయిక జరగాలని రాహుల్ పేర్కొన్నారు. ముంబైలో ముగిసిన విపక్ష ఇండియా కూటమి భేటీలో ఈరోజు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.
12 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటుతో పాటు సీట్ల సర్దుబాటు చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించామని అన్నారు.ఇండియా కూటమి కాషాయ పార్టీని మట్టికరిపించేందుకు ఈ నిర్ణయాలు అవసరమని చెప్పారు. ఈ కూటమిలో నేతల మధ్య సంబంధాల బలోపేతమే అసలైన కార్యాచరణ అని రాహుల్ పేర్కొన్నారు. విపక్ష పార్టీల మధ్య గత రెండు భేటీల్లో అనుబంధం, అరమరికలు లేని స్నేహ బంధం మొగ్గతొడిగాయని చెప్పుకొచ్చారు.