న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం పలు అవాంతరాలు, గందరగోళం మధ్య వాయిదా పడిన అనంతరం గురువారం 12వ రోజు తిరిగి ప్రారంభమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో భారత్-చైనా సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణ వ్యవహారం గత కొద్దిరోజులుగా పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేస్తుండగా గురువారం సైతం ఇండో-బోర్డర్ వివాదంపై సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.
ఈ అంశపై సమగ్ర చర్చకు పట్టుబడుతూ రాజ్యసభ నుంచి విపక్షాలు మూకుమ్మడిగా వాకౌట్ చేశాయి. డిసెంబర్ 9న అరుణాచల్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ఉదంతంపై పలు ప్రశ్నలు లేవనెత్తి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీసింది. సమగ్ర చర్చకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో పెద్దల సభ నుంచి విపక్షం వాకౌట్ చేసింది.
ఇక చైనాతో బోర్డర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వ తీరును విపక్షాలు పార్లమెంట్లోపల, వెలుపల తీవ్రంగా తప్పుపడుతున్నాయి. చైనా ఆక్రమణపై ప్రభుత్వం వాస్తవాలు దాస్తోందని, యుద్ధానికి బీజింగ్ సిద్ధమైనా కేంద్ర ప్రభుత్వం నిద్రలో జోగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.