ఈ సీక్వెల్ను ప్రధాని ప్రమోట్ చేయగలరా?
ఆశలు చూపి రప్పించి పండిట్లను చంపుతున్నారు!
పండిట్ల రక్షణ కంటే డర్టీ పాలిటిక్సే బీజేపీకి ముఖ్యం
కశ్మీరీ పండిట్ల భద్రతలో మోదీ సర్కారు అట్టర్ ఫ్లాప్
కశ్మీర్ పరిస్థితులపై కేంద్రాన్ని తూర్పారబట్టిన విపక్షాలు
న్యూఢిల్లీ/ముంబై/కశ్మీర్, జూన్ 5: ఉగ్రవాదుల ఊచకోత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం పండిట్లు, ఇతర హిందూ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సాధారణ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉగ్రమూకలు సాధారణ పౌరులను పొట్టనపెట్టుకుంటున్నా.. కేంద్ర ప్రభుత్వం వారి భద్రతపై నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. 1990లో మాదిరిగా పండిట్లు భయాందోళనతో, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని మళ్లీ వలసబాట పడుతున్న నేపథ్యంలో మోదీ సర్కారు స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పడు అలా చేయగలరా?
కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘గతంలో జరిగిన వలసల పేరుతో వచ్చిన సినిమాను పన్నులు మినహాయించి మరీ ప్రమోట్ చేసిన బీజేపీ నేతలు.. కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న హత్యలు, తదనంతర వలసలపై ‘కశ్మీర్ ఫైల్స్ 2’ తీయగలరా?.. ఈ సీక్వెల్ను పీఎం మోదీ, ఆయన సర్కారు ప్రమోట్ చేయగలదా?’ అని రౌత్ ఆదివారం ట్విట్టర్లో ప్రశ్నించారు. ప్రస్తుత కష్ట సమయంలో కశ్మీరీ పండిట్లకు అండగా ఉంటామని, వారికి అవసరమైన సాయం చేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. ఈ మేరకు పండిట్ల నేతలతో చర్చలు చేసున్నామని చెప్పారు. స్వస్థలాలకు రావాలంటూ పండిట్లకు కొత్త ఆశలను చూపించి.. ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. పండిట్లు ప్రస్తుతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పరిస్థితులు పునరావృతం కావడం దురదృష్టకరమని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. పండిట్లకు మద్దతుగా ఉంటామని, వారి కోసం మా రాష్ట్ర తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.
మీటింగ్లే.. చర్యలు ఎక్కడ?
ప్రస్తుత బీజేపీ హయాంలో కశ్మీర్లో 1990 నాటి పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. పండిట్ల రక్షణ కంటే మురికి రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యమని మండిపడ్డారు. కశ్మీర్ అంశంలో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన ‘జన్ ఆక్రోశ్ ర్యాలీ’ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వరుస హత్యల నేపథ్యంలో పండిట్లు బలవంతంగా కశ్మీర్ను వీడాల్సి వస్తున్నదని అన్నారు. హత్యలు జరిగినప్పుడు మీటింగ్లు చేయడమే తప్ప.. చర్యలు ఎక్కడని ప్రశ్నించారు. కశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దేందుకు ఏం చర్యలు తీసుకుంటారో బహిరంగంగా చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఆందోళనలపై కేంద్రానికి భయం
పండిట్లకు రక్షణ కల్పించడంలో హోంమంత్రి అమిత్ షా ఘోరంగా విఫలమయ్యారని ఎన్సీపీ విమర్శించింది. రాజకీయ ప్రయోజనాల కోసం కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని బీజేపీ ప్రమోట్ చేసిందని ఎన్సీపీ నేత మహేష్ తపాసే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కశ్మీర్లో మైనారిటీల వరుస హత్యలకు నిరసనగా ఇక్కడి రాజకీయ పార్టీలు ఆందోళనలకు అనుమతించడం లేదని, కేంద్రం భయపడుతున్నదని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు.
8 సురక్షిత జోన్లకు పండిట్ల బదిలీకి నిర్ణయం!
ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కశ్మీరీ పండిట్లు, స్థానికేతర ప్రభుత్వ అధికారులను కశ్మీర్లోని 8 సురక్షిత జోన్లకు బదిలీ చేసేందుకు జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం నిర్ణయించినట్టు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం అమిత్షా నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదించినట్టు తెలిపాయి. కశ్మీర్లో నివసిస్తున్న మతపరమైన మైనారిటీలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కశ్మీర్ పండిట్ సంఘర్ష్ సమితి(కేపీఎస్ఎస్) ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. కశ్మీర్ను వీడేందుకు ప్రయత్నిస్తున్న హిందువులను అధికారులు అడ్డుకుంటున్నారని కేపీఎస్ఎస్ చీఫ్ సంజయ్ ఆరోపించారు.