న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపైనే అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రిమోట్ ఓటింగ్ మెషీన్ల(ఆర్వీఎం)లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని విపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ను ప్రశ్నించాయి. ముందుగా ఓటింగ్ సరళిపై పట్టణ ప్రాంతాలు చూపుతున్న అనాసక్తిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని వారు కోరారు. వలస ఓటర్లు ఎక్కడ నుంచైనా ఓటు వేసేలా రూపొందించిన ఆర్వీఎం పనితీరును పరిశీలించాలని ఈసీ అభ్యర్థించిన నేపథ్యంలో కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు సమావేశమయ్యారు.
కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సమావేశంలో మాట్లాడుతూ విపక్షాలేవీ ఆర్వీఎంల పనితీరు పరిశీలించాలని కోరుకోవడం లేదని అన్నారు. అసలు ఈ మెషీన్ అవసరం ఇప్పుడేముందన్న విషయంపై తాము సమాధానం కోరుతున్నామన్నారు. దీనిపై తొలుత ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. ఆర్వీఎం అన్న ఆలోచనే అంగీకారయోగ్యం కాదని, ఇప్పటికే ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా పలు పార్టీలు, మేధావులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మెషీన్ ప్రవేశపెడితే ఎన్నికల సమయంలో వివిధ రాష్ర్టాలలో ఉన్న వలసవాదులకు తాము ఎలా ప్రచారం చేయగలమని ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ ప్రశ్నించారు. కాగా ఆర్వీఎం ద్వారా వలసదారులు దేశంలో ఎక్కడ ఉన్నా తమ నియోజకవర్గ అభ్యర్థికి ఓటు వేయవచ్చు.