న్యూఢిల్లీ : చంద్రయాన్-3 విజయవంతమై భారత్ అంతరిక్ష సూపర్పవర్స్లో ఒకటిగా చేరడంతో ఆ విజయాన్ని తన ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ చాటుకుంటున్నారని విపక్షాలు (Opposition) మండిపడ్డాయి. ప్రతిష్టాత్మక ఇస్రోకు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పునాది వేశారని, యావత్ ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో ఇప్పుడు భారత్ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు నాటి ప్రధాని నెహ్రూ ముందుచూపుతో నాంది పలికారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
భారత స్పేస్ మిషన్కు నెహ్రూ హయాంలో లభించిన ఊతం, భరోసా గురించి గ్రాఫిక్ కార్డ్ను కూడా కాంగ్రెస్ ఈ ట్వీట్లో పొందుపరిచింది. మరోవైపు విపక్ష ఇండియా కూటమికి చెందిన మరో పార్టీ ఆర్జేడీ సైతం మూన్ మిషన్పై బీజేపీ అత్యుత్సాహాన్ని ఎండగట్టింది. మూన్ మిషన్ విజయవంతమైనందుకు కృషి చేసిన శాస్త్రవేతల ఘనతను, సామర్ధ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తనదిగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేసింది.
ప్రధాని మోదీ హుందాగా వ్యవహరించి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాలని ఆర్జేడీ నేత ఇజా యాదవ్ హితవు పలికారు. కాగా విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ మూన్ మిషన్ విజయవంతమైన ఘనతను తనదిగా చెప్పుకోవడం లేదని అన్నారు. ఆయన కేవలం ఇస్రో బృందాన్ని అభినందించారని చెప్పారు. చంద్రయాన్-2 విఫలమైనప్పుడు ప్రధాని మోదీ ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి శాస్త్రవేత్తల బృందాన్ని కలిసి వారిలో భరోసా నింపారని మంత్రి గుర్తుచేశారు.
Read More :
Chandrayaan-3 | చంద్రుడిపై భారత్ అడుగులు మొదలయ్యాయి : ఇస్రో ట్వీట్