Satyapal Malik | న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి ఆఖరి గవర్నర్గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. మోదీ అసమర్థత కారణంగానే 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిందని ఆరోపించారు. బీబీసీపై దాడుల విషయంలో ప్రధాని దిద్దుకోలేని తప్పు చేశారని పేర్కొన్నారు. పుల్వామా దాడి జరిగిన 2019లో, అదే సంవత్సరం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ర్టాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన సమయంలో గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ ‘ది వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడికి కేంద్ర నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కేంద్ర రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఉన్న ఆ సమయంలో తమ జవాన్లను తరలించడానికి ఎయిర్క్రాఫ్ట్ కావాలని సీఆర్పీఎఫ్ కోరగా, హోం శాఖ తిరస్కరించిందని, అంతేకాకుండా జవాన్లు ప్రయాణించిన మార్గం రక్షణపరంగా అంత సురక్షితం కాదని తెలిపారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఈ దుర్ఘటన తర్వాత కార్బెట్ పార్క్ బయట నుంచి తనకు మోదీ ఫోన్ చేసినప్పుడు సంఘటనలోని లోపాలన్నీ ఆయనకు వివరించానన్నారు. దీనిపై ప్రశాంతంగా ఉండాలని, ఎవరితో మాట్లాడవద్దంటూ మోదీ తనకు చెప్పారన్నారు. అజిత్ ధోవల్ సైతం తనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఏమీ మాట్లాడవద్దని చెప్పారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందన్న ఆలోచనతోనే బీజేపీ ప్రభుత్వం ఇలా వ్యహరించినట్టు తనకు అర్థమైందని వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఘోర వైఫల్యం కూడా ఉన్నదని ఆరోపించారు. పాకిస్థాన్ నుంచి 300 కిలోల ఆర్డీఎక్స్తో వచ్చిన ఒక వాహనం 10-15 రోజుల పాటు జమ్ముకశ్మీర్లోని గ్రామాలు, పట్టణాల్లోని రోడ్లపై యథేచ్ఛగా తిరిగినా దానిని గుర్తించడంలో ఇంటెలిజెన్స్ విఫలమైందని తెలిపారు.
జమ్ముకశ్మీర్లో 2018లో మెహబూబా ముఫ్తీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వక పోవడానికి అనేక కారణాలున్నాయని మాలిక్ వివరించారు. వాస్తవానికి 87 మంది సభ్యుల అసెంబ్లీలో ఆమెకు 56 మంది సభ్యుల మద్దతు ఉన్నదని, అయితే ఆమెకు ప్రభుత్వ ఏర్పాటుకు చాన్స్ ఇవ్వకుండా అసెంబ్లీని రద్దు చేయడానికి కారణం ఉన్నదని తెలిపారు. ఆమెకు అప్పటివరకు మద్దతు ఇస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు అసెంబ్లీని రద్దు చేయాలని తనను కోరాయన్నారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే పార్టీ నేతల కోసం పెద్దఎత్తున బేరసారాలు జరుగుతాయని, దీనికి అవకాశం లేకుండా అసెంబ్లీ రద్దుకే పలు పార్టీలు మొగ్గు చూపినందున తాను రద్దు చేసినట్టు మాలిక్ వివరించారు.
తాను గవర్నర్గా ఉన్న సమయంలో బీజేపీ-ఆరెస్సెస్ నేత రామ్మాధవ్ తనను కలిసి జమ్ముకశ్మీర్లో హైడ్రో ఎలక్ట్రిక్, రిలయన్స్ ఇన్సూరెన్స్ పథకాలకు అనుమతి కోరారని, కానీ తాను వాటిని తిరస్కరించినట్టు చెప్పారు. దీనిపై తాను ఎలాంటి తప్పు చేయనని స్పష్టం చేశానని తెలిపారు. తర్వాత ఆ పథకాలకు అనుమతి ఇస్తే రూ.300 కోట్లు ఇస్తామని కొందరి నుంచి ఆఫర్ వచ్చిందన్నారు. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను రద్దు చేసి ప్రధాని మోదీ తప్పు చేశారని, ఈ విషయంలో ఆయనను కొందరు తప్పుదోవ పట్టించారని, ఇప్పటికైనా మోదీ తన తప్పును సరిదిద్దుకుని రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరారు.